టర్కీ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి సురక్షితం

  • ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి
  • మేడ్చల్ జిల్లా వాసి బొక్క రాజశ్రీగా గుర్తింపు
  • యువతి సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అదృశ్యమైన తెలంగాణ యువతి బొక్క రాజశ్రీ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, రాజశ్రీ ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన రాజశ్రీ, అమెరికాలోని హ్యూస్టన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె, అక్కడి నుంచి మరో విమానం ఎక్కాల్సి ఉంది. అయితే, హ్యూస్టన్‌లో విమానం ఎక్కినప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులను ఆశ్రయించారు.

ఈ ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రాజశ్రీ ఆచూకీని కనుగొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ను కోరారు. స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మరోవైపు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ, దౌత్య కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరిపారు.

అధికారుల నిరంతర కృషి ఫలితంగా జూన్ 18న రాజశ్రీ ఆచూకీ లభించింది. ఆమె ఆచూకీ దొరికిందని, ప్రస్తుతం సురక్షితంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆమె ఏ పరిస్థితుల్లో అదృశ్యమయ్యారనే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Bokka Rajashree
Istanbul Airport
Telangana girl missing
Chamala Kiran Kumar Reddy
Turkey

More Telugu News